విశాఖపట్నం విమాన సేవలు కోల్పోతుందా? ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డంకులేనా?

అంతర్జాతీయ విమానయాన సంస్థలు విశాఖను పక్కన పెట్టి, ఇతర నగరాలకు ప్రాధాన్యం

ఆంధ్రప్రదేశ్‌లో విమాన సేవల అభివృద్ధికి సంబంధించి విశాఖపట్నం ఆర్థిక, పారిశ్రామిక కేంద్రంగా ఉన్నప్పటికీ, నేరుగా ఇతర ప్రధాన నగరాలకు విమాన సేవలు తగ్గిపోతున్నాయి. తాజా పరిణామాలు చూస్తుంటే, ఇటీవల విశాఖ నుంచి సేవలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపిన అంతర్జాతీయ విమానయాన సంస్థలు విజయవాడ, హైదరాబాద్ వంటి ఇతర ఎయిర్‌పోర్టులపై దృష్టి పెట్టడం ఆందోళన కలిగిస్తోంది.

దుబాయ్ విమాన సేవలు విజయవాడకు మార్పు, వియత్నాం ఎయిర్‌లైన్స్ హైదరాబాద్‌కు మొగ్గు

మొదట ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ నుండి విశాఖపట్నం నుంచి నేరుగా దుబాయ్‌కు విమాన సేవలు ప్రారంభం కావాల్సి ఉండగా, కొన్ని అజ్ఞాత కారణాల వల్ల ఆ సేవలను విజయవాడకు మార్చారు.

తాజాగా మరో భారీ ఎదురుదెబ్బగా వియత్నాం ఎయిర్‌లైన్స్ & వియట్‌జెట్ తమ 2025 ప్రారంభంలో విశాఖపట్నం నుంచి సేవలు అందించాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఇప్పుడు అవి హైదరాబాద్‌కు మారాయి. విశాఖపట్నం అధికారులు ఆవిధంగా ఆసక్తి చూపకపోవడం, స్పందన ఆశించిన స్థాయిలో లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.

ఈలోగా అకాశా ఎయిర్ కూడా విశాఖ నుంచి తన కార్యకలాపాలను విస్తరించేందుకు అనుమతులు ఎదురు చూస్తున్నా, ఇప్పటికీ ఎటువంటి పురోగతి కనిపించడం లేదు.

ఈ నిర్లక్ష్యమా? లేక ఉద్దేశపూర్వక రాజకీయ వ్యూహమా?

ఈ విమాన సేవల లోటుతో పరిశ్రమల నేతలు, విశాఖ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి దిశలో ఉత్తరాంధ్రను బలిపశువుగా మార్చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమాన సేవలకు సంబంధించిన అనేక నిర్ణయాలను ప్రభావితం చేసే కేంద్ర పౌర విమానయాన మంత్రి స్వయంగా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తే అయినా, ఆయన ప్రాభావం విశాఖ సేవలను కాపాడటంలో విఫలమవుతోందా? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అభివృద్ధి అవకాశాలను విశాఖకు దూరంగా ఉంచుతూ, విజయవాడ మరియు అమరావతికి మళ్లిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీని వెనుక నాయుడు భవిష్యత్ రాజధాని వ్యూహమే ఉందా? అనే చర్చ ఊపందుకుంది.

వ్యాపార వర్గాలు, విశాఖ ప్రజల డిమాండ్ – ప్రభుత్వం జవాబు చెప్పాలా?

విమాన సేవలకు సంబంధించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. విశాఖ వ్యాపార వర్గాలు, పరిశ్రమల నాయాకులు చాలా కాలంగా మెరుగైన విమాన కనెక్టివిటీ కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కానీ, తాజా పరిణామాలతో విశాఖ అభివృద్ధి వెనకడుగు వేస్తోందన్న భావన బలపడుతోంది.

నిర్ణయాల్లో పారదర్శకత అవసరం, విశాఖను విస్మరించకుండా సరైన చర్యలు తీసుకోవాలి అని ప్రజలు, పరిశ్రమలు, వ్యాపార వర్గాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. విశాఖపట్నం ఈ విధంగా విమాన సేవల అభివృద్ధిలో వెనుకబడితే, దీని ప్రభావం భవిష్యత్ పరిశ్రమల పెట్టుబడులపైనా, ఆర్థిక వృద్ధిపైనా తీవ్రంగా పడనుంది.

ప్రభుత్వం ఇప్పటికైనా అప్రమత్తమవుతుందా? లేక ఉత్తరాంధ్రను మరింత వెనుకబడేలా చేయడమే లక్ష్యమా? – అన్న ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో తేలనుంది.

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *